భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా, వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లు.. వగైరా వగైరా తర్వాత మన తెలంగాణ సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇవాళ(శనివారం) చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.
రేపు(ఆదివారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజం పక్షాన, మన పక్షాన అంబేద్కర్కు హృదయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను. ఈ దేశంలోనే ఎక్కడ లేనంత సమున్నత గౌరవం అంబేద్కర్కు ఇవ్వాలని రెండు పనులు చేశాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి దేశానికే సమున్నత గౌరవం వచ్చేలా చేశాం. కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. 75 ఏండ్లలో ఇలాంటి పని ఎవరూ చేయలేదు. ఇలా ఆ హానీయుడికి నివాళులర్పించామని కేసీఆర్ తెలిపారు.
రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికలు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజానీకానికి ప్రభుత్వం అంటే ఒక ధీమా, ఒక ధైర్యం. మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలి. ప్రజలు కోరుకునేది అదే. యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం మీద ఆత్మశిశ్వాసం ఉండాలి. ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభల్లో చెప్పాను. ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్పాను. కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలకు ఓటర్లు గురవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నాలుగు నెలలు గడిచి ఐదో నెలలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్క విషయంలో కూడా ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్దితో కూడిన కార్యాచరణ కనబడుతలేదు. వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం కనబడుతలేదు. పదేండ్ల కింద మరిచిపోయిన ఇబ్బందుల మళ్లీ ఇప్పుడు కనబడుతున్నాయన్నారు కేసీఆర్.
రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంట్ కోతలు, కాలిపోయే మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు, అందని సాగు, తాగునీరు సమస్యలు. నాడు ఇబ్బందుల్లో రైతాంగం ఉండే. దాన్ని నివారించాలని కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడుకున్నట్టు మనం రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉండే వారు రైతు. అన్ని వర్గాల్లో ఉన్న రైతులను కాపాడుకోవాలని పట్టుబట్టి ఒక ఐదు పథకాలు పెట్టాం. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు అందించాం. 24 గంటల పాటు రెప్పపాటు పోకుండా నాణ్యమైన విద్యుత్ అందించాం. రైతు చనిపోతే గుంట భూమి ఉన్న 5 లక్షల బీమా వారం పది రోజుల్లో వచ్చేలా చేసుకున్నాం. అదే విధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చేసుకున్నాం. ఇలా రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాం అని కేసీఆర్ తెలిపారు.
ఇది కూడా చదవండి రేవంత్ రెడ్డి ది స్కీం ల పాలన కాదు స్కాం ల పాలన