భారతీయ కళాజగత్తు విశ్వజనీనమైంది. అదే సమయంలో తనదైన విశిష్టతనూ కలిగి ఉంటుందనేది తెలిసిందే. ఇది స్థానిక, విదేశీ కళారీతుల సమాగమ ఫలితం. ఈ సమాగమానికి నిలువెత్తు దర్పణం లాంటి కళా ప్రదర్శనకు త్వరలో తెరలేవబోతున్నది.
భారతీయ కళాజగత్తు విశ్వజనీనమైంది. అదే సమయంలో తనదైన విశిష్టతనూ కలిగి ఉంటుందనేది తెలిసిందే. ఇది స్థానిక, విదేశీ కళారీతుల సమాగమ ఫలితం. ఈ సమాగమానికి నిలువెత్తు దర్పణం లాంటి కళా ప్రదర్శనకు త్వరలో తెరలేవబోతున్నది. చార్సౌ పురానా షహర్ ఓ అపురూపమైన కుంచెల పండుగకు.. అరుదైన కళా సమ్మేళనానికి వేదిక కాబోతున్నది.
విశిష్ట సాంస్కృతిక కేంద్రంగా, విశ్వనగరంగా వినుతికెక్కిన హైదరాబాద్ నగరం ఓ బృహత్తర కళా ప్రదర్శనకు దివిటీ పట్టబోతున్నది. 200 మంది కళారంగ దిగ్గజాల కళాకృతులు ఈ మహాప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
2024 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు మాదాపూర్లోని చిత్రమయీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగే ఈ ఆర్ట్ ఫెస్ట్కు వినూత్నమైన రీతిలో ‘న్యూస్ ఆర్ట్ ఫెస్ట్ 2024’ అని పేరుపెట్టారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్.. అంటే ఇంగ్లిష్లో నలుదిక్కులు గుర్తుచేసే ‘న్యూస్’ అనే మాట ఈ భారీ ప్రదర్శన పేరులో ఉండటం దీని విస్తృతిని తెలియజేస్తున్నది. అంతకుముందు ఫిబ్రవరి 12 నుంచి 17వ తేదీ వరకు ఆర్ట్ క్యాంపు జరుగనున్నది.

ఇండియా ఫైన్ఆర్ట్ (ముంబై) ఆధ్వర్యంలో ఈ మహా కళా ప్రదర్శన జరుగుతుంది. ప్రముఖ కళాకారులు డాక్టర్ లక్ష్మణ్ ఏలె, బోల్గమ్ నగేశ్ గౌడ్, ఇండియా ఫైన్ ఆర్ట్ (ముంబై) వ్యవస్థాపకుడు మన్విందర్ దావర్ ఈ కళాప్రదర్శనకు క్యూరేటర్లుగా వ్యవహరిస్తున్నారు.
వివిధ కళాధోరణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం నలుమూలలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటుండటం విశేషం. ఉత్తరాది నుంచి అంజలీ ఇళా మీనన్, శోభా బ్రూటా తదితరులు, దక్షిణాది నుంచి లక్ష్మాగౌడ్ వైకుంఠం, రవీందర్రెడ్డి తదితరులు, తూర్పు నుంచి జోగెన్ చౌదరి, సుహాస్ రాయ్, చంద్ర భట్టాచార్య, పశ్చిమం నుంచి రినీ ధుమాల్, రేఖా రాడ్విట్టియా, ఇంద్రప్రమిత్ రాయ్, సురేంద్రన్ నాయర్, వృందావన్ సోలంకి తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.

హైదరాబాద్ మహానగరంలో ఇటీవలి కాలంలో ఇంత పెద్దయెత్తున కళా ప్రదర్శన ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. కళా చరిత్రపై ఉపన్యాసాలు, జానపద కళపై, నూతన కళారీతులపై వర్క్షాపులు, చలనచిత్ర ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వాక్త్రూస్, ప్యానెల్ డిస్కషన్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. దేశంలోని సమకాలీన ధోరణులు, శైలులు ప్రతిబింబించేలా ఎంపికలు జరిగాయి. చేయితిరిగిన కళాకారులే కాకుండా కెరీర్ మధ్యలో ఉన్నవారు, ప్రోత్సాహం, తోడ్పాటు అవసరమైన యువకళాకారులకు చోటు కల్పించడం ఈ ప్రదర్శన ప్రత్యేకతగా చెప్పాలి.

ఈ సమ్మేళనంలో దేశం నలుమూలల పురుడుపోసుకున్న వివిధ రకాల శైలులను ఒకచోటికి చేర్చి, వాటి మధ్య అనుసంధానం చేయడమే ప్రదర్శన పరమోద్దేశమని క్యూరేటర్లలో ఒకరైన డాక్టర్ లక్ష్మణ్ ఏలె చెప్పారు. ప్రదర్శనలో కళాకారుల నుంచి ఆహ్వానించిన పెయింటింగ్లు, శిల్పాలు, ఇన్స్టాలేషన్లు, న్యూమీడియా ఆర్ట్ తదితర కళాకృతులను ప్రదర్శిస్తారు. ఇక థీమ్ విషయానికి వస్తే పౌరాణిక, ఆధ్యాత్మిక, ప్రకృతి, భావనాత్మక చిత్రణలు ఇలా అన్నిరకాల ధోరణులకు స్థానం కల్పించారు. తొలినాళ్ల ఆధునిక కళ నుంచి నేటి వరకు పొడసూపిన విభిన్న ధోరణులను సమతూకం చేసేందుకు ప్రయత్నించినట్టు మరో క్యూరేటర్ నగేశ్ గౌడ్ వెల్లడించారు.

బాంబే ప్రోగ్రెసివ్ గ్రూప్, కోల్కతా గ్రూప్, మద్రాస్ స్కూల్, బరోడా నెరేటివ్ ఫిగరేటివ్ వంటి విభిన్న కళోద్యమ సంస్థలు, బృందాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. మూర్త, అమూర్త వ్యక్తీకరణతో గీసిన చిత్రాలు నాటి, నేటి కళాధోరణులను కండ్లకు కట్టేలా ప్రదర్శనలు ఉంటాయి. మట్టి, చెక్క, ఉక్కు, కాంస్యం తదితర విభిన్న మాధ్యమాలతో రూపొందించిన విభిన్న శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పొచ్చు.
ఇక సాంస్కృతిక ప్రదర్శనల విషయానికి వస్తే.. ఆర్ట్ క్యాంపు మొదలయ్యే ఫిబ్రవరి 12 నుంచి ముగింపు రోజు మార్చి 7 వరకు వివిధ రకాల ప్రదర్శనలు జరుగుతాయి. ఆర్ట్ క్యాంపులో శోభా బ్రూటా, ప్రభాకర్ కోల్టె, వి.రమేశ్ తదితర 12 మంది సీనియర్ కళాకారులు పాల్గొంటారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా ఫిబ్రవరి 18న జయవంత్ నాయుడు హవాయి గిటార్ కచేరీ, 23న సంజయ్ అష్టపుత్రే సితార్ కచేరీ ఉంటాయి. అదే విధంగా మార్చి 3న రాజ్ ఆర్ దర్శకత్వం వహించిన ‘8 ఏఎం మెట్రో’ చిత్ర ప్రదర్శన జరుగుతుంది.
– తుమ్మలపల్లి రఘురాములు 91827 77750
