కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో లోపాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీని కేంద్ర జల్శక్తిశాఖ నియమించింది.
- ఐదుగురు సభ్యులతో నియమించిన ఎన్డీఎస్ఏ
- చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్
- 6న బరాజ్ల వద్దకు కమిటీ
- 3 బరాజ్లను పరిశీలించి లోపాలను గుర్తించాలి..
- పునరుద్ధరణకు సిఫారసులు చేయాలని దిశానిర్దేశం
- 4నెలల్లో పూర్తిస్థాయి నివేదికనివ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో లోపాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీని కేంద్ర జల్శక్తిశాఖ నియమించింది.
ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గురవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్లో పలుచోట్ల నీటి బుంగలు ఏర్పడిన నేపథ్యంలో కారణాలను అన్వేషించి, తగిన సిఫారసులు చేయాలని కోరుతూ ఎన్డీఎస్ఏ చైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం గత నెల 13న లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో డ్యామ్సేఫ్టీ యాక్ట్ 2021లోని సెక్షన్ 8ని అనుసరించి ఎన్డీఎస్ఏ తాజాగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ను చైర్మన్గా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్, పవర్ రిసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ ఆర్ పాటిల్, సీడబ్ల్యూసీ బీసీడీ డైరెక్టర్ శివకుమార్ శర్మ, గేట్స్, సీడబ్ల్యూసీ, డిజాస్టర్ అండ్ రెసిలియెన్స్ డైరెక్టర్ రాహుల్కుమార్సింగ్ను సభ్యులుగా నియమించింది.
కమిటీకి ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలు..
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి, ప్రాజెక్టు స్థల సంబంధిత సమస్యలపై సమగ్ర అధ్యయనం కోసం సంబంధిత ఏజెన్సీలు, అధికారులతో చర్చించాలి. బరాజ్ల హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ అంశాలను నిర్ధారించాలి.
- ప్రాజెక్ట్ డాటా, డ్రాయింగ్లు, డిజైన్ మెమోరాండం, పరీక్షలు, సైట్ పరిశోధన నివేదికలు, బరాజ్ పోస్ట్, ప్రీ మాన్సూన్ తనిఖీ నివేదికలు, బరాజ్ల డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నియంత్రణ, ఇతర నివేదికలు, మెటీరియల్లను పరిశీలించాలి.
- సైట్ పరిశోధనలు, డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, హామీ, ఆపరేషన్, మెయింటనెన్స్, నిర్వహణ, మూడు బ్యారేజీల సంబంధిత సమస్యలకు బాధ్యత వహించే సంబంధిత అధికారులు, ఏజెన్సీలతో చర్చించాలి.
- మూడు బ్యారేజీల రూపకల్పనలో సహాయం కోసం నిర్వహించిన భౌతిక/గణిత నమూనాలను అధ్యయనం చేయాలి.
- మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగుబాటుకు దారితీసిన కారణాలను, గమనించిన ఇతర సమస్యలను పరిశీలించాలి. మిగిలిని రెండు అప్స్ట్రీమ్ బ్యారేజీల్లో గమనించిన సమస్యలకు కారణాలను గుర్తించాలి.
- మూడు బ్యారేజీల్లోని సమస్యలను పరిషరించడానికి, నివారించడానికి తీసుకోవాల్సిన, నిర్వహించాల్సిన తదుపరి అధ్యయనాలు/ పరిశోధనలను సిఫారసు చేయాలి. అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలి.
- కమిటీ తన నివేదికను నాలుగు నెలల్లోగా ఎన్డీఎస్ఏకు సమర్పించాలి.
కమిటీకి సహకరిస్తాం: మంత్రి
కాళేశ్వరం బరాజ్ల పరిశీలనకు నిపుణుల కమిటీ ఈ నెల 6న రానున్నదని, వారికి అన్ని రకాలుగా సహకరిస్తామని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. నిపుణుల కమిటీ సూచనలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
మళ్లీ కాలయాపనే
నిరుడు అక్టోబర్ 24, 25 తేదీల్లో ఎన్డీఎస్ఏ బృందం మేడిగడ్డ బరాజ్ను సందర్శించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. వాస్తవంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం దేశంలో ఏ ఆనకట్టకు ప్రమాదం వాటిల్లినా దాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఎన్డీఎస్ఏకు ఉన్నది. కానీ మేడిగడ్డ ఘటనపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే 4 నెలలు జాప్యంచేసింది. ఎక్స్పర్ట్ కమిటీని వేయలేదు. ఇప్పుడు కమిటీని వేసినా మళ్లీ 4 నెలల్లో రిపోర్టు ఇవ్వాలనడం వెనక కుట్ర దాగి ఉన్నది. నాలుగు నెలల గడువుతో ఈ సీజన్లో రిపేర్లు చేయడం అసాధ్యం. వరదలు వస్తే బరాజ్కు మరింత నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఇతర బ్లాక్లు కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. అందుకు కేసీఆర్ను బద్నాం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నది.
– వీ ప్రకాష్, మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్
