గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఖరారు చేసింది. జూన్ 9న నిర్వహించనున్నట్లు ఇవాళ(సోమవారం) TSPSC ప్రకటించింది. ఇటీవలే TSPSC 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు సరిచేసుకోవచ్చంది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ జరగనుంది. మెయిన్ పరీక్షను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. TSPSC పేపర్ లీకుల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక ముందస్తు షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈక్రమంలోనే మెయిన్స్ పరీక్ష అక్టోబర్లో ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని ఇటీవల ప్రభుత్వం 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఇదిలా ఉంటే గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణపై కూడా అధికారులు దృష్టి సారించారు. అదనపు పోస్టులు కలిపి జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్: మరో 3రోజుల్లో ముగియనున్న ఈ-కేవైసీ గడువు
