దర్యాప్తు సంస్థ తీరుపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత… సుప్రీం కోర్టులో ఇవాళ ( సోమవారం) పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందన్నారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో తెలిపారు. దీనికి సంబంధించి కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్లైన్లో పిటిషన్ వేశారు.
నిన్న(ఆదివారం) ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుసమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటికొస్తానని ఆమె వారితో తెలిపినట్లు సమాచారం. ఇవాళ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు ఆమెను కలిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి:Breaking : గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.!
