నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే మే 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. అందువల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు.
పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఒకే నిర్ణయంతో జేఎఫ్ఆర్ఓపీఎస్ సంయుక్త వేదికగా ఏర్పడ్డారు. ఈ వేదిక తరఫున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్ వివరించారు. ఇతర ప్రభుత్వ సంఘాలు కూడా తమ పోరాటంలో భాగం కానున్నాయని ప్రకటనలో తెలిపాయి. కొత్త పింఛను విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు.
ఇది కూడా చదవండి: మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు
