తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి లభించిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఇవాళ( ఆదివారం) సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పార్టీల కూటమి చర్చలపై రాష్ట్రంలో ఏర్పడిన సందిగ్దానికి బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎన్డీయే,ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి పార్టీ హై కమాండ్ అనుమతించిందని తెలిపారు.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ,బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వివరించారు.
బీఎస్పీ,బీఆర్ఎస్ కూటమి కలిసి పోటీ చేసే స్థానాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ బెహన్జీ దూతగా హాజరుకానున్నారని తెలిపారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు,ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే సంయుక్తంగా మీడియాకు చెబుతామన్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులపై మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలు, వదంతులు,దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు,ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్
