బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నిన్న(శుక్రవారం) రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన సురేందర్, అతని సోదరీలతో కలిసి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా, ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. వీరి బైక్ను ఢీకొట్టింది. కారు.. బైక్ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే సురేందర్, అతని సోదరీలు శైలి, అను మృతిచెందగా… మరొక మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బైక్ను ఢీకొట్టిన తర్వాత కారు వారి మీద వెళ్లినట్లు దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బైక్ను ఢీకొట్టిన కారును ఇంకా గుర్తించలేదన్నారు. అలాగే ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. సీసీటీవీని పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: లోక్ సభ బరిలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి