పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమొటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పదే పదే పాలమూరు బిడ్డను అని ఐడింటిటీ క్రైసిస్ కోసం రేవంత్ తాపత్రయపడుతున్నాడు. అసలు పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలపై రేవంత్ కు ఉన్న ఆర్తి ఏంటి? ఏంటని ప్రశ్నించారు. పాలమూరు బహిరంగసభలో రేవంత్ వ్యాఖ్యలపై ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు నిరంజన్ రెడ్డి. పాలమూరు మీద ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోడీ సభలో జాతీయహోదా కావాలని ఎందుకు అడగలేదు? రేవంత్ ది ఉన్మాద భాష .. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగబద్ధ ప్రమాణం చేసి నేరపూరిత భాష మాట్లాడడం విధ్వంసం, అరాచకత్వం, టెర్రరిజం ప్రోత్సహించేలా ఉన్నది. రాజకీయ పరిశీలకులు, మేధావులు అసహ్యించుకునేలా రేవంత్ మాటలున్నాయి. పద్దతి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా రేవంత్ పదే పదే నేను అలాగే చేస్తా అంటున్నాడు. బొందపెడతం, పండబెట్టి తొక్కుతాం, పేగులు మెడల వేసుకుంటాం అనేవి ఏం మాటలు. త్యాగాల తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛగా మలిగేలా కేసీఆర్ పదేళ్లు పాలించారు. కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద తాహతు లేనివాళ్లు, అనామకులు, స్థాయి లేని వాళ్లు అవాకులు, చెవాకులు పేలినా ప్రభుత్వం, పార్టీ శ్రేణులు హుందాగా వ్యవహరించారు. తన పక్కన ఉన్న వారితోనే ముప్పు అని రేవంత్ భావిస్తున్నట్లుంది .. కేసీఆర్ పేరుతో వారిని తిడుతున్నట్లుంది. విధాన పరమైన అంశాలు మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ గురించి గతంలో రేవంత్ మాట్లాడిన వీడియోలు ఆన్ లైన్ లో ఉన్నాయన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో సర్వం నష్టపోయిన పాలమూరుకు సాగునీళ్లు, ఐదు మొడికల్, ఒక ఫిషరీస్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్. రైతుబంధు, సాగునీళ్లు ఇచ్చిన కేసీఆర్ ను దుర్మార్గుడు అని నువ్వు అంటే ప్రజలు ఒప్పుకుంటారా. గతేడాది 14 శాతం అధిక వర్షపాతం వచ్చినట్లు ఐఎండీ రిపోర్టు ఇచ్చింది. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికబద్దంగా పనిచేసి ప్రజలకు నీళ్లు అందించాం. కరెంట్ , రవాణా, ట్రాఫిక్ అన్ని రంగాల్లో నిస్తేజం నెలకొన్నది. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ముందుచూపు లేదని విమర్శించారు నిరంజన్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న పార్లమెంటు స్థానాలు కేవలం 55 మాత్రమే .. ఈసారి అవి అయినా ఉంటాయో ? ఒకటి రెండు మీద పెరుగుతాయో తెలియదు. రాహుల్ దేశమంతా తిరుగుతున్నాడు.. కాంగ్రెస్ చిన్న సైజు ప్రాంతీయపార్టీ. తెలంగాణలో అధికారం వస్తే ఇక దేశమంతా అధికారం అన్నట్లు రేవంత్ భావిస్తున్నాడు. ప్రజలకు మేలు జరగాలని కేంద్రంతో సఖ్యతగానే ఉన్నాం .. అనేక అంశాల్లో మద్దతు ఇచ్చాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, కృష్ణా జలాల పంపిణీ కోసం అనేక సార్లు కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర సహకారం అందదు అని తెలుసుకున్నాక దూరంగా ఉన్నామని తెలిపారు.
రేవంత్ కు మోడీ పెద్దన్న అయితే రాహుల్ ఏం కావాలి ? నెలలో ఎన్నికలు పెట్టుకుని మోడీ సహకారం అడగడం అంతర్లీనంగా రేవంత్ ఆలోచన తెలుస్తోందన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి మేము 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పడం మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకోవడమేనన్నారు. 48 గంటల్లో గ్రూప్ 2,3 పోస్టులు పెంచకుంటే ఆమరణ దీక్ష చేస్తామని నిరుద్యోగులు చెబుతున్నారు. కేసీఆర్ విధ్వంసం చేశారు అని చెప్పడానికి సిగ్గుండాలి .. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పథకం కానరావడం లేదా? పాలమూరులో ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడం విధ్వంసమా ? 11 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడం విధ్వంసమా ? పండిన పంటలు, ప్రభుత్వ కొనుగోళ్లు అబద్దమా అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పినందుకు రేవంత్, కాంగ్రెస్ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ మీద చేసిన వ్యాఖ్యలను ఖండించింది ఒక్క కేసీఆర్ మాత్రమే.. అదే ఆయన గొప్పతనం. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. రాష్ట్ర కాంగ్రెస్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి సహకరించే దోరణిలో ఉందన్నారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రైతు బంధుతో సహా అన్ని పథకాల్లో కోత
