
- పాచిపోయిన ఫుడ్ ఫొటోలు షేర్ చేసిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ, జనవరి 11: వందే భారత్ రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ ప్రయాణికులు తిరస్కరించారు. ఎక్స్ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చింది. ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడు తనకు రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ వాటి పోటోలను ఎక్స్లో పంచుకున్నారు. తాను నిరాశకు గురయ్యాయని, తాను చెల్లించిన డబ్బులను వెనక్కివ్వాలని కోరారు.
‘హాయ్ సర్.. నేను 22416లో ప్రయాణిస్తున్నా. నాకు సరఫరా చేసిన ఫుడ్ పాచిపోయి వాసన వస్తున్నది. ఈ అమ్మకందారు వందే భారత్ బ్రాండ్ పేరును చెడగొడుతున్నాడు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకొన్నామని రైల్వే సేవ తెలిపింది. ఐఆర్సీటీసీ క్షమాపణ చెప్పింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఆహార సరఫరాదారుకు తగిన జరిమానా విధిస్తామంది. పర్యవేక్షణను మరింత దృఢతరం చేస్తామంది. ఈ ఘటనపై ఓ నెటిజన్ స్పందిస్తూ రాజధాని రైల్లోనూ తనకు ఇలాగే జరిగిందని తెలిపారు.
