మరి కొద్ది రోజుల్లో పెళ్లి. మ్యారేజ్ లో స్మైల్ లుక్ తో అందంగా కన్పించాలని అనుకున్నాడు ఓ యువకుడు. దీంతో స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగింది.
లక్ష్మీనారాయణ వింజం (28) అనే యువకుడికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో తన ముఖంపై చిరునవ్వును తీర్చిదిద్దుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం సిటీలోని ఓ ప్రముఖ డెంటల్ హాస్పిటల్ డాక్టర్లను ఆశ్రయించాడు. స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్ ద్వారా ముఖాన్ని తీర్చిదిద్దేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీనారాయణ తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్లిన లక్ష్మీనారాయణకు డాక్టర్లు అనెస్థీషియా ఇచ్చి సిద్ధం చేశారు.
అయితే.. కాసేపటి తర్వాత లక్ష్మీనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించారు. తాము ఆసుపత్రికి చేరుకునే సరికే లక్ష్మీనారాయణ అపస్మారక స్థితిలో ఉన్నాడని బాధితుడి తండ్రి రాములు తెలిపారు. హుటాహుటిన దగ్గర్లోన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీనిపై రాములు వింజం పోలీసులను ఆశ్రయించారు. దంత వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అనెస్థీషియా ఓవర్ డోస్ కారణంగానే తమ కొడుకు చనిపోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి:విద్యార్థినుల ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి
The post వికటించిన స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్.. కాబోయే వరుడి మృతి appeared first on tnewstelugu.com.
