తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఈనెలలో శ్రీవారి సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల కోటాను విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడీప్ కోసం పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. 20వ తేదీన లక్కీడీప్ లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 21న ఉదయం 10గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను రిలీజ్ చేయనుంది.
జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు 21న ఉదయం 10గంటలకు భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. 21న మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేయనుంది. 23న ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 23న ఉదయం 11గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదల కోటాను విడుదల చేస్తుంది.
23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తుంది. 25న ఉదయం 10గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తుందని టీటీడీ పేర్కొంది. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవకోటాను, అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
ఇది కూడా చదవండి: ఆ యాడ్కు లేడీ సూపర్స్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
