ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు గంటపాటు యోగా, ప్రాణాయామం చేస్తే మంచి జీవితం గడపవచ్చని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లకుండా ఉంటేనే తెలంగాణలో ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రులు నిర్మించడం ఆరోగ్యకరమైన తెలంగాణ కాదని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కళాశాల క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. వేడుకలకు అతిథిగా విచ్చేసిన మంత్రి హరీశ్ రావు యోగాసనాలు వేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో భాగమైందని, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించాలని అన్నారు. అనారోగ్యంతో బాధపడిన తర్వాత యోగా ఆరోగ్యానికి అని పొరపాటున కొందరు అంటున్నారు. రోజూ యోగా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా దీర్ఘాయుష్షు పొందవచ్చని మంత్రి హరీశ్ అన్నారు. ఆధునిక ప్రపంచంలోని ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. అన్ని సమస్యలకు యోగా ఒక్కటే పరిష్కారం. ఫోన్లో అనవసర విషయాల గురించి మాట్లాడటానికి సమయం ఉంది, కానీ యోగా చేయడానికి సమయం లేదు. చిన్నవయస్సులోనే అనేక రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యోగా వల్ల శరీరానికి ఆరోగ్యమే కాదు, మనసుకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది.
ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రపంచ దేశాలు భారత్ నుంచి యోగా నేర్చుకుంటున్నాయన్నారు. అన్ని ఆసుపత్రుల్లో గర్భిణులకు యోగాసనాలు నేర్పిస్తున్నామని, వీటి ద్వారా ఆరోగ్యంగా, సుఖ ప్రసవాలు జరిగే అవకాశం ఉందన్నారు. హరితహారంలో మొక్కలు నాటడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
