తిరుపతి: కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు.

తిరుపతి: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో ఉందని, పేద పిల్లలకు ఉచితంగా గుండె మార్పిడి చేయించడం అభినందనీయమన్నారు.
గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవ మార్పిడి చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఖరీదైనవని చెప్పారు. ఈ ఆసుపత్రిలో టీటీడీ ఆధ్వర్యంలో దాదాపు 1600 గుండె సంబంధిత శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించామని, ఇది భగవంతుని సేవగా అభివర్ణించారు. జాతీయ స్థాయిలో ట్రాన్స్ప్లాంట్ వైద్యుల కొరత ఉందని, మరింత మందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఔట్ పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్, వార్డులను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆస్పత్రి అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథరెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

