స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగిన పొరపాట్లను, సమన్వయలోపాన్ని గుర్తిస్తున్నది. భవిష్యత్తు కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తున్నది.
- పార్టీ శ్రేణుల్లో సడలని ఆత్మవిశ్వాసం
- కార్యకర్తతో నాయకత్వ కరచాలనం
- తెలంగాణ భవన్ కేంద్రంగా కార్యాచరణ
- కొత్త సన్నాహకానికి ఊపిరిలూదుతున్న సమావేశాలు
BRS | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగిన పొరపాట్లను, సమన్వయలోపాన్ని గుర్తిస్తున్నది. భవిష్యత్తు కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తిస్తున్నది. అన్నిటికన్నా మిన్నగా బీఆర్ఎస్ పార్టీ అన్నా, అధినాయకుడు కేసీఆర్ అన్నా తమకెంత అభిమాన మో, అనుబంధమో కార్యకర్తలు ఒక్కొరొక్కరుగా అనుభవాలను వెల్లడిచేసే వేదికగా తెలంగాణ భవన్ మారింది. ఈ నెల 3 నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకత్వం కరచాలనం చేస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికిగల కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నది. బీఆర్ఎస్ 10 ఏండ్లు అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తకు, నాయకత్వానికి మధ్య లింకు తెగిపోయిందని, దాన్ని తిరిగి జతచేయాల్సిన అవసరం ఉందని సమావేశాలు నిరూపిస్తున్నాయి.
ఆహ్వానితుల కన్నా అధికంగా
సాధారణంగా ఎన్నికల ఫలితాల తరువాత ఓడిపోయిన పార్టీలు సమావేశాలు నిర్వహించటానికి వెనుకడుగు వేస్తాయి. పిలిచినవారు వస్తారో రారో? అని అనుమానపడతాయి. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ భిన్నం అని తెలంగాణ భవన్లో సమావేశాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలుండగా, రోజుకో నియోజకర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు ఇలా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 60 నుంచి 70 మందితో మొత్తం 450 నుంచి 500 మందివరకు నాయకులు హాజరవుతారని భావించింది. అయితే అనూహ్యంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1000 మందికిపైగా హాజరువుతున్నారు. తెలంగాణ భవన్లోని సమావేశ మందిరం కాలుపెట్ట సందులేకుండా కిక్కిరిసిపోతున్నది. అన్ని సమావేశాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
ఖుల్లం ఖుల్లా…
ఇప్పటి వరకు జరిగిన 10 నియోజకవర్గాల సమావేశాల్లో నేతలు మొహమాటం లేకుండా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ‘కాంగ్రెస్ తన సొంతబలంతో గెలవలేదని, బీఆర్ఎస్లోని నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న బలహీనతల వల్లే గెలిచింది’ అని అందరూ అంగీకరిస్తున్నారు. ఉద్యమకారులకు, పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండామోసిన కార్యకర్తలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయంలేకపోవడం, చాలామంది ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సరైన సమయంలో సమన్వయం చేయకపో గా ఇంకా అంతరాన్ని పెంచే చర్యలు తీసుకున్న చోట పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా ఇతర నేతలు సమావేశాన్ని ప్రారంభించే ముందే సన్నాహక సమావేశం నిర్వహణ నేపథ్యాన్ని చెప్తున్నారు. రెండు విడుతలుగా జరిగే సమావేశం ముందు గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర ఒక్కరిద్దరు నేతలు, ఆ పార్లమెంట్ పరిధిలోని నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు అవకాశం కల్పించటం, నేరుగా చెప్పటానికి ముందుకురాని వారు పేపర్ మీద వారి అభిప్రాయాన్ని రాసి పంపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏకవ్యక్తి కేంద్రంగా సాగుతుందని, కార్యకర్తలు, నాయకులకు మాట్లాడే అవకాశం ఎంతమాత్రం లేదని చేసేవి కేవలం ఆరోపణలేనని సమావేశాలు తేల్చిచెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాము ఆశించినస్థాయిలో రాకపోయినా కుంగిపోకుండా ఓటమి పాఠం నుంచి సరికొత్త గెలుపుదారుల్లో పయనిస్తామని గులాబీ శ్రేణులు ప్రతినబూనుతున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, జహీరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల సమావేశాలు పూర్తయ్యాయి. సంక్రాంతి పండుగ తరువాత తిరిగి 17వ తేదీన నాగర్కర్నూల్ నియోజకర్గ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అభ్యర్థిత్వాల కోసం అభ్యర్థనల వెల్లువ
రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులు, వివిధ సామాజికవర్గాలకు చెందిన నేతలు, ఉద్యమకారులు, మేధావులు, యూనివర్సిటీ అధ్యాపకులు (ఉస్మానియా, కాకతీ సహా పలు యూనివర్సిటీల), సామాజికవేత్తలు కేటీఆర్, హరీశ్రావు తమతమ బయోడేటాలను అందజేస్తున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినాయకత్వంతో తమ అభ్యర్థిత్వాలపై చర్చించి అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తుండటం విశేషం.