పాకిస్తాన్ లో చలి విపరీతంగా పెరుగుతోంది. పంజాబ్ ప్రావిన్స్లో గత మూడు వారాల్లో విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చిన్నారుల్లో న్యుమోనియా ప్రబలుతోంది. ఇప్పటివరకు న్యుమోనియా కారణంగా 220 మంది చిన్నారులు చనిపోయారు. జనవరి 1 నాటికి, ప్రావిన్స్లో 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. చనిపోయిన పిల్లలందరూ ఐదేళ్లలోపు వారే. వీరిలో 47 మంది పిల్లలు ఒక్క లాహోర్లోనే మరణించారు. గతేడాది పంజాబ్ ప్రావిన్స్లో న్యుమోనియా కారణంగా 990 మంది చిన్నారులు చనిపోయారు.
మరణించిన పిల్లలలో చాలా మందికి న్యుమోనియా టీకాలు వేయలేదని పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. వారు పోషకాహారలోపం, బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పిల్లలకు మాస్క్లు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, వెచ్చని దుస్తులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
పంజాబ్లోని ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఇపిఐ) డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ, పాకిస్తాన్లో సాధారణంగా పుట్టిన ఆరు వారాల తర్వాత శిశువులకు యాంటీ న్యుమోనియా వ్యాక్సిన్ను ఇస్తారని చెప్పారు. న్యుమోనియా బాక్టీరియా, వైరస్లు రెండింటి వలన సంభవించవచ్చు. టీకాలు వేసిన పిల్లలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించబడతారు కానీ వైరల్ న్యుమోనియా ద్వారా ప్రభావితం కావచ్చని తెలిపారు.
ఈ వ్యాధి కోవిడ్-19 లాగా విస్తరిస్తోంది:
గత సంవత్సరం, పంజాబ్లో 990 మంది పిల్లలు న్యుమోనియాతో మరణించారు. ప్రావిన్స్లో పిల్లలలో న్యుమోనియా కేసులు పెరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. న్యుమోనియా నుంచి చిన్నారులను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీనియర్ వైద్యులను ప్రభుత్వం కోరింది. చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధి వేగంగా పెరుగుతోందని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా విస్తరిస్తున్నదని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: తమిళ నటుడు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం..?
