జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్ఎంసీ)కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.
- ఇటీవలే ప్రభుత్వ పాఠశాలలకు రూ.16 కోట్ల గ్రాంట్స్ను విడుదల చేసిన ప్రభుత్వం
- మరో రెండు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
- ఎస్ఎంసీ కమిటీల రద్దుతో నెలకొన్న చెక్ పవర్ సమస్య
- ‘మన ఊరు- మన బడి’కి సంబంధించి మరో రూ.3.58 కోట్ల చెల్లింపులపైననూ సందిగ్ధత
రంగారెడ్డి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్ఎంసీ)కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. కొత్త కమిటీలను ఇప్పట్లో ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ఆయా పాఠశాలల అభివృద్ధి, మెయింటనెన్స్ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. ‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాలల్లో చేపట్టిన పనులకు సంబంధించి త్వరలోనే రూ.3.58 కోట్లు విడుదల కానున్నాయి. వీటిని కూడా ఎస్ఎంసీ కమిటీల ద్వారానే డ్రా చేయాల్సి ఉండడంతో గుత్తేదారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలల మెయింటనెన్స్పై సందిగ్ధత..
జిల్లాలో ఉన్న 881 ప్రాథమిక పాఠశాలలు, 181 ప్రాథమికోన్నత పాఠశాలలు, 248 ఉన్నత పాఠశాలల నిర్వహణకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరానికిగాను మొదటి విడుతలో ఇటీవలనే 50 శాతం నిధులు మంజూరయ్యాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని నిధులను విడుదల చేశారు.
ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 30 మంది ఉంటే ఏడాదికి రూ.11వేలు, 31-100 మధ్య ఉంటే రూ.25వేలు, 101-250 మంది ఉంటే రూ.50వేలు, 251-1,000 మందికి రూ.75వేలు, వెయ్యి మందికి పైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఇలా.. అన్ని పాఠశాలలకు కలిపి స్పోర్ట్స్ నిధులు, స్కూల్ కాంప్లెక్స్లకు సంబంధించి రూ.16 కోట్లను ఆయా పాఠశాలల ఆకౌంట్లలో జమయ్యాయి.
ఈ నిధులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు స్కూల్ మెయింటనెన్స్తోపాటు, కంప్యూటర్ సర్వీసింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు, స్టేషనరీ, క్రీడా సామగ్రి కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుంది. వీటికి వినియోగించే ప్రతి పైసాను పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం చేయాల్సిందే. పాఠశాల హెచ్ఎం, ఎస్ఎంసీ చైర్మన్లకు జాయింట్ చెక్ పవర్ను కల్పించారు. వీరిద్దరి సంతకాలతోనే నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎస్ఎంసీ కమిటీలు రద్దు అయ్యాయి. ఈ నెల 29న కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో నిధులను ఎలా డ్రా చేయాలన్న సందిగ్ధత నెలకొనడంతోపాటు పాఠశాలల మెయింటనెన్స్పైనా ఆందోళన వ్యక్తమవుతున్నది.
‘మన ఊరు-మన బడి’ గుత్తేదారుల్లో గుబులు..
రంగారెడ్డి జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు తీసుకొచ్చింది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 468 పాఠశాలలు ఎంపికకాగా.. 448 పాఠశాలలకు రూ.97.88 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇచ్చింది.
ఇప్పటి వరకు 65 పాఠశాలల్లో పనులు పూర్తై పునః ప్రారంభమయ్యాయి. పలుచోట్ల పనులను పూర్తి చేసి చాలాకాలం అవుతున్నప్పటికీ సగం మేర మాత్రమే బిల్లులు చెల్లించారు. రూ.3.58 కోట్ల బకాయిలకు సంబంధించి అధికారులు ప్రభుత్వానికి నివేదించగా.. త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులను కూడా ఎస్ఎంసీ కమిటీ ద్వారానే డ్రా చేయాల్సి ఉండడంతో గుత్తేదారులు ఆందోళన చెందుతున్నారు.
మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం..
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నది. మొదటి విడుతలో మంజూరైన 50 శాతం స్కూల్ గ్రాంట్స్ నిధులను ఖర్చు చేస్తేనే మిగతా 50 శాతం నిధులు విడుదల కానున్నాయి. దీంతో పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎస్ఎంసీ చైర్మన్ స్థానంలో చెక్ పవర్ ఎవరికి ఇస్తారన్న దానిపై విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరగా నిర్ణయం వెల్లడిస్తే.. బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.