మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి… కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలి. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలేనన్నారు. సంగారెడ్డిలో పార్టీ నాయకులతో కలిసి ఇవాళ(గురువారం) హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదన్నారు. మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. అలాంటి కేసీఆర్ ను తిట్టడం అవివేకమంటూ తీవ్రంగా ఖండిచారు. పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతరు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేనా అది. పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హరీశ్ రావు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దని సూచించారు. నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతరు. నేను అలా మాట్లాడి విలువ తగ్గించుకోనన్నారు. కుసంస్కాంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుందన్నారు.
భవిష్యత్ లో రాజకీయాలకు వచ్చే వారికి స్ఫూర్తిగా మనం ఉండాలనే విలువలతో నేనుంటాను అని అన్నారుహరీశ్ రావు. ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిగా పని చేసినం అన్నది ముఖ్యం. కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నాడుని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో బతుకులు బాగుపడ్డాయి. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయన్నారు. చూస్తే కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థం అవుతుందన్నారు. 10 ఏండ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్. వలసలకు నిలయం నాటి పాలకులు చేస్తే, వ్యవసాయానికి నిలయం చేసింది కేసీఆర్. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు..ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా.. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి వైఎస్ఆర్ నీళ్లు తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి మాట్లాడాడా? కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు హరీశ్ రావు.
1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము 10ఏండ్లనే 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎకరాలకు నీళ్లు అందించామని తెలిపారు హరీశ్ రావు.నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. బీమా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కోయిల్ సాగర్ పనులు పూర్తి చేసి 32 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చాం. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని తెలిపారు.
వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టు 80శాతం అయ్యింది. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వండని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తాగు, సాగు, విద్య, పరిపాలనలో పాలమూరును అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. 60 ఏండ్ల మీ పాలనలో ఒక్క కాలేజీ ఏర్పాటు చేయలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయండి. మేము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశాం. నికర జలాలు తెలంగాణ అప్పుడు వస్తాయి. మంచి వాదనలు వినిపించండి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదన్నారు. ఓట్లు ,సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలని సూచించారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు
The post మహబూబ్నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే appeared first on tnewstelugu.com.
