టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. దీనికి సంబంధించి ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ( శుక్రవారం) హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించడం అనవాయితీగా వస్తోందని.. పక్క రాష్ట్రాల్లో టెట్ వేసిన విషయం ప్రభుత్వం గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత రాదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెట్ నిర్వహించాలని కోరారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. టెట్ నిర్వహించి ఆరు నెలలు అవుతుందని, అందులో 10శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని.. ఈ నేపథ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలని కోరారు ఆర్.కృష్ణయ్య.
గతంలో పోస్టులు తక్కువగా ఉండటం, సిలబస్ మారడంతో చాలా మంది అర్హత సాధించలేకపోయారని తెలిపారు. బీఈడీ, డీఈడీ పాసైన నిరుద్యోగులు టెట్ వేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఒక అవకాశం కోల్పోతామనే ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 24 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉంటే కేవలం 11 వేల పోస్టులతో భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. 24 వేల టీచర్ పోస్టుల భర్తీ, టెట్ వేసి డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్తో 11న ఇందిరాపార్కు దగ్గర ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు
