పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. గులాబీ రంగులో ఉండే ఈ పీచు మిఠాయిలో హానికారక రసాయన పదార్థాలు ఉన్నాయన్న కారణంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాయి. లేటెస్టుగా పీచు మిఠాయి అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. అంతేకాదు, ఫుడ్ కలర్ వాడిన మంచూరియా వంటకం పైనా కర్ణాటక ప్రభుత్వం బాన్ చేసింది. ఫుడ్ కలర్ వాడే వంటకాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు.
రాష్ట్రంలో 171 రకాల వంటకాల శాంపిళ్లను అధికారులు పరిశీలించారని, అందులో 107 వంటకాల్లో ప్రమాదకర కృత్రిమ రంగులు వాడుతున్నట్టు గుర్తించారని వివరించారు. రోడమైన్-బి, టార్ట్రాజిన్ వంటి రసాయనాల వల్ల ఆహార పదార్థాలకు ఆకట్టుకునే కలర్ వస్తుందని, అయితే ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని చెప్పారు. అందుకే వీటిపై కర్ణాటకలో నిషేధం విధించామని… ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచు మిఠాయి ఎవరైనా అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి దినేశ్ గుండూరావు.
ఇది కూడా చదవండి: అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానం తూతూ మంత్రంగా చేశారు
