Road accident | అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్ను ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం డివైడర్ ఢీకొని గాల్లోకి ఎగిరింది. డివైడర్ అవతలి రోడ్డును దాటి సర్వీస్ రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో వ్యక్తి మోపెడ్పై వెళ్తున్న పండ్ల వ్యాపారి.

Road accident : అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్ను ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం డివైడర్ ఢీకొని గాల్లోకి ఎగిరింది. డివైడర్ అవతలి రోడ్డును దాటి సర్వీస్ రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో వ్యక్తి మోపెడ్పై వెళ్తున్న పండ్ల వ్యాపారి.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని విల్లుపురానికి చెందిన మణికండన్ అనే వ్యక్తి తన భార్య నాగజ్యోతి (28), మామ కనగవేల్ (62), అత్త కృష్ణకుమారి (51), తన ఇద్దరు కుమార్తెలు, కొడుకు, మరో ఇద్దరు బంధువులతో కలిసి ధలవాయిపురం ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. బుధవారం తెల్లవారుజామున 6.30 గంటలకు వారి వాహనం విదుర్నగర్-మధురై జాతీయ రహదారిపై తిరుమంగళం సమీపంలోని శివకొట్టైవద్ద ప్రమాదం బారినపడింది.
శివకొట్టైలో పాండి అనే పండ్ల వ్యాపారి తన మోపెడ్పై రోడ్డు దాటుతుండగా అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పింది. మోపెడ్ ఢీకొట్టి ఆ తర్వాత డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుకు కుడివైపున సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ప్రమాదంలో మణికండన్ భార్య, అత్త, మామతోపాటు తన కవల కుమార్తెల్లో ఒకరైన శివాత్మిక (8), పండ్ల వ్యాపారి పాండి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మణికండన్ మరో కుమార్తె శివశ్రీ (8), కొడుకు శివ ఆదిత్య (5), బంధువులు రత్నస్వామి (64), మీనా (55) లకు తీవ్ర గాయాలయ్యాయి.
కారు నడిపిన మణికండన్ ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమంగళం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.