ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల తర్వాత గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.
‘‘సాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. రొటీన్ చెకప్లో భాగంగా మమ్మల్ని సంప్రదించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించాం. దీంతో యాంజియోగ్రఫీ చేయించమని సూచించాం. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం’’ అని తాజాగా డాక్టర్లు తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఠాగూర్’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలు పోషించారు. ‘గుడుంబా శంకర్’, ‘సూపర్’, ‘అతడు’, ‘రాఖీ’, ‘పోకిరి’, ‘దుబాయ్ శీను’, ‘నేనింతే’, ‘కింగ్’, ‘అదుర్స్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇది కూడా చదవండి: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది