రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.

- వ్యాపారులు కుమ్మక్కైతే కఠిన చర్యలు
- మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్ రద్దుతోపాటు బ్లాక్లిస్ట్లో పెట్టండి
- రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్కు తేవాలి
- ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులను మోసం చేసే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మారెట్ యార్డుల్లో తకువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులను రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించారు. కొన్నిచోట్ల తేమ ఎకువగా ఉన్నదంటూ వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు ధాన్యాన్ని కళ్లాల నుంచి నేరుగా కాకుండా ఒకటి రెండు రోజులు ఆరబెట్టి తీసుకొనిరావాలని కోరారు.
ధాన్యం ఆరబెట్టేందుకు మారెట్ యార్డుల్లో తగిన ఏర్పాట్లుచేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చూడాలని ఆదేశించారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని, కలెక్టర్లు తమ పరిధిలోని మారెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిషరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్రస్థాయిలో రోజూ పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాలకు నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశపూర్వక కథనాలు వస్తున్నాయని, అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
వచ్చే రెండు నెలలు కీలకం
పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఎకువ నీటిని సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని పేర్కొన్నారు. భూగర్భ జల మట్టం పడిపోవడంతో ప్రజలు నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. సీఎస్ సారథ్యంలో మిషన్భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై రోజూ సమీక్ష జరపాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, సమస్యను పరిషరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా చూడాలని, మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి నీటిని తెచ్చుకోవాలని ఆదేశించారు. సింగూర్ నుంచి నీటి సరఫరాకు సన్నద్ధంగా ఉండాలని కోరారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటకతో సంప్రదింపులు జరపాలని సూచించారు. హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచినట్టు సీఎం దృష్టికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఆటంకం కల్పించినవారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు.