కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
![ప్రజాహితమా.. ప్రచారమా?](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2024/02/high-court-3.jpg)
- కాళేశ్వరం పిల్స్పై హైకోర్టు ఆగ్రహం
- ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు
- కోర్టులో రాజకీయ ప్రసంగాలు సహించం
- ‘కాళేశ్వరం’లో అవినీతిపై ఆధారాలున్నాయా?
- ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలివ్వలేం
- సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి
- హైకోర్టు వ్యాఖ్యలు.. విచారణ 8కి వాయిదా
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణలో ఎన్నికల ప్రసంగాలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాజకీయాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని, కాబోవని తేల్చిచెప్పింది. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పిటిషనర్లను హెచ్చరించింది. ఇవి ప్రజాహిత వ్యాజ్యాలా? ప్రచార వ్యాజ్యాలా? అంటూ నిలదీసింది. అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది.
ప్రభుత్వ వాదనలు కూడా వింటాం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకున్నదని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బీ రామ్మోహన్రెడ్డి, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి, ముదిగంటి విశ్వనాథరెడ్డి, బక జడ్సన్ వేర్వేరుగా వేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఏవిధమైన ఆదేశాలూ ఇవ్వలేమని ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
ఈ రోజే దోషులకు శిక్ష వేయాలా?
వ్యక్తిగత హోదాలో కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ.. గత రెండేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై కీలక సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా తెలంగాణలో భారీ ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అన్నారు. వెంటనే అడ్డుకున్న హైకోర్టు, ఈ వ్యవహారంపై ఇప్పటికిప్పుడే అంటే ఈరోజునే తేల్చేయాలా? అని ప్రశ్నించింది. పిటిషన్లను అనుమతించి, తప్పులు చేసిన అవినీతిపరులను జైళ్లకు పంపాలా? అని పేర్కొన్నది.
హైకోర్టు రాజకీయ వేదిక కాదని, కాశేశ్వరం అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చేసి వాదనలు వినిపిస్తే వినాలా? అని నిలదీసింది. కేసుల విచారణలో కోర్టులకు ఒక విధానం అంటూ ఉంటుందని గుర్తుచేసింది. ప్రభుత్వ వాదనలు కూడా వినాల్సి వుంటుందని, ఆ తర్వాతే తగిన ఆదేశాలు జారీచేస్తామని స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎలా తెలిసిందని నిలదీసింది.
అవినీతి, అక్రమాల గురించి పిల్లో ఎకడ పేరొన్నారని ప్రశ్నించింది. మీడియాలో వచ్చిన కథనాలేనా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని అడిగింది. పిల్లో మీడియాలో కథనాలు వచ్చాయని మాత్రమే పేరొన్నారని, అవినీతి, అక్రమాలపై ఆధారాలు ఏమీ పేరొనలేదని తప్పుపట్టింది. మీరుగా ఏమైనా అధ్యయనం చేశారా, పరిశోధన ఏమైనా చేశారా? అని ప్రశ్నించింది.
మీరు చేసిన పరిశోధనలేమిటో, ముడుపులు చేతులు మారాయనడానికి ఆధారాలు ఏమిటో చెప్పాలని నిలదీసింది. ‘ప్రాజెక్టు 4 పిల్లర్స్కు మరమ్మతు చేయించాలంటే మేము అకడికి వెళ్లి పనులు చేయించాలా? అది కూడా ఇప్పుడే వెళ్లాలా? పోనీ ఒక పనిచేద్దామా.. అందరూ కలిసి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి అడ్డుగా నిలబడదామా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముందుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో తెలుసుకోవాలని హితవు చెప్పింది. హైకోర్టు నిబంధనల ప్రకారం పిటిషన్ను సవరించి తిరిగి దాఖలు చేయాలని సూచించింది.
పిల్ నాదని చెప్పుకోడానికి వీల్లేదు..
ప్రజాహిత వ్యాజ్యమంటే ప్రజా సమస్యను కోర్టు దృష్టికి తేవడమని, ఆ తర్వాత ఏం చేయాలో కోర్టులు నిర్ణయిస్తాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపింది. సుప్రీంకోర్టు చెప్పిందే చట్టమని పేర్కొంది. పిల్స్ విచారణకు న్యాయవాదుల సహకారం అవసరమేగానీ విచారణలో వాదనలకు అవసరం లేదని తెలిపింది. ఇది మా వ్యాజ్యమని చెప్పడానికి ఇదేమీ సర్వీస్ వివాదం కాదని పేర్కొంది.
రాజకీయ ప్రయోజనంతో వేశారా?
ఇతర వ్యాజ్యాలతో తమ పిల్ను జత చేయరాదని, కేఏ పాల్ పిల్ను విడిగా విచారణ చేయాలని బక జడ్సన్ తరఫు న్యాయవాది ఎస్ శరత్ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రొఫెసర్ కోదండరాం తరఫు న్యాయవాది గడువు కావాలని కోరుతున్నారని, మీరేమో ఇప్పుడే విచారణ చేయాలంటున్నారని, ఒకే అంశంపై దాఖలైన వ్యాజ్యాలను వేర్వేరుగా విచారణ చేయలేమని స్పష్టంచేసింది. విడిగా విచారణ చేయాలన్నదే మీ అభిమతమైతే.. తిరసరిస్తూ రాత పూర్వక ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది.
విశ్వనాథరెడ్డి తరపు న్యాయవాది జీ నందిత వాదనలు వినిపిస్తూ పిల్ను ఎన్నికలకు ముందే గత నవంబర్లో దాఖలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారకముందే వేశామన్నారు. పిల్కు నంబర్ ఇచ్చేందుకు ఆలస్యమైందని చెప్పడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది రాజకీయ ప్రయోజనాలతో దాఖలు చేశారా అని ప్రశ్నించింది. పిటిషన్ తొలి విచారణకు వచ్చినపుడు న్యాయవాదిగా మీరెందుకు రాలేదని కూడా ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు విచారణ చేయబోమని, ప్రభుత్వ వాదనలు వినాల్సివుందని, సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలన్న అభ్యర్థనలపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ఖాన్ హాజరయ్యారు.
పలు ప్రశ్నలతో ఉకిరిబికిరి చేసిన హైకోర్టు
ముడుపులు చేతులు మారాయని ఎలా తెలిసింది? అవినీతి జరిగిందని ఎలా చెబుతున్నారు? దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి? ముడుపుల పాత్ర గురించి ఎలా తెలుసు? 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు అవినీతి జరిగిందని తెలియదా? ఇంతకాలం ఏం చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బాగోతంపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలు కాకుండా మీరు చేసిన పరిశోధన ఏమిటి? అసలు ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎలా తెలిసింది? అవినీతి జరిగితే ఎవరికి ఫిర్యాదు చేశారు? దానిపై స్పందన ఏమైనా ఉందా? ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించామని చెబుతుండగా, దీనిపై తాము గతంలో ఉత్తర్వులు ఇచ్చామని చెబుతున్నా పట్టించుకోరా? ఇప్పటికిప్పుడు విచారణ చేసి మీరు కోరినట్లుగా ఉత్తర్వులు ఇవ్వాలా? మీతో ఏకీభవించి ఇప్పటికిప్పుడు తప్పు చేసిన వాళ్లను కటకటాల వెనకి పంపాలా?.. అని పిటిషనర్లను ప్రశ్నలతో ఉకిరిబికిరి చేసింది.