రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రభుత్వ సహకారంతో సీసీటీవీల ఏర్పాటు, నిర్వహణలో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. బుధవారం ఉప్పల్లో ట్రాఫిక్ పోలీస్ శాఖ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఆయన తన ప్రసంగంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖలో అధునాతన వాహనాలను సమకూర్చడంతోపాటు సాంకేతిక వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర పరిశోధన, నేరాల నియంత్రణ సులువుగా మారిందని వెల్లడించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సమావేశంలో రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, జీహెచ్ ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.