అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డులు సృష్టించిన తెలంగాణ, తాజాగా మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంలో అలంకరించుకొన్నది. స్టేట్స్టార్టప్ ర్యాంకింగ్స్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. పటిష్ఠమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన తొరవ, తెగువకు ఈ ర్యాంకు తార్కాణం.
Read Also: త్వరలో విద్యుత్ చార్జీల పెంపు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ చేతులమీదుగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సీఐఈ డాక్టర్ శాంతా తౌటం, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ‘స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్స్-2022’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్రంజన్ మాట్లాడుతూ డీపీఐఐటీ నిర్వహించిన స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్స్-2022లో తెలంగాణ మొదటిస్థానంలో నిలువటం రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలవరకు ఆవిష్కర్తలను ప్రోత్సహించిందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సమర్థంగా వినియోగించేలా కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించామని చెప్పారు. టీ హబ్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్లు కార్యకలాపాలను విస్తరించాయని పేర్కొన్నారు. నిరంతరం స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్ మాత్రమే కాకుండా టీఎస్ఐసీ, టీ వర్క్స్, వీ హబ్, రిచ్, టాస్క్ వంటి సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అన్ని సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే జాతీయ స్థాయిలో తెలంగాణకు ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.