SEBI | ఈ నెల 28 నుంచి ఇన్వెస్టర్లు షేర్లు కొన్న లేదా విక్రయించిన రోజే సెటిల్మెంట్ పూర్తి చేస్తామని సెబీ చైర్ పర్సన్ మాధాబీ పూరీ బచ్ చెప్పారు.
SEBI | స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయ, విక్రయాల విషయమై మార్కెట్ల రెగ్యులేటర్ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పూరీబచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి ఇన్వెస్టర్లు షేర్లు కొన్న లేదా విక్రయించిన రోజే సెటిల్మెంట్ పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఆప్షనల్ మాత్రమేనన్నారు. కొన్ని నెలలుగా స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల వేగంగా పెరుగుతున్నదని, మార్కెట్లో ఇటువంటి పరిణామాలు ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) విభాగంలో జరుగుతున్న ధరల అవకతవకలను గమనిస్తున్నామని ఆమె చెప్పారు.
వివిధ సంస్థల ఐపీఓలతోపాటు స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లోనూ ఈ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాధాబీ పూరీ బచ్ చెప్పారు. కనుక ఇన్వెస్టర్లు అలర్ట్ గా ఉండాలని సోమవారం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నిర్వహించిన చర్చాగోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వివిధ షేర్ల ధరల్లో తేడాలకు సంబంధించిన సంకేతాలను టెక్నాలజీ సాయంతో గుర్తిస్తున్నట్లు మాధాబీ పూరీ బచ్ చెప్పారు. దీనిపై కొన్ని నమూనాలు సేకరించామని, మార్కెట్ భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకున్నామని, నిపుణులతో కలిసి పూర్తి స్థాయి సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత లోపాలు తేలితే బహిరంగంగా సంపరదింపులు జరుపుతామన్నారు. పెద్ద సంస్థలతో పోలిస్తే ఎస్ఎంఈలు విభిన్నమైనవన్న సంగతి ఇన్వెస్టర్లు గుర్తించాలన్నారు. ఎస్ఎంఈ నిబంధనలు, నష్ట భయాలపై ఇన్వెస్టర్లకు తెలిసేలా విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు.